Thursday, April 3, 2014

36. వజ్రసూచికోపనిషత్తు :

సచ్చిదానందస్వరూపమైనదియు, సర్వుల బుద్ధివృత్తులకు సాక్షియైనదియు, వేదాంతవేద్యమైనదియు, అనంతరూపమైనదియు నగు బ్రహ్మమునకు నమస్కారము.

అద్వైతమును, జాతిగుణక్రియలు లేనిదియు, పుట్టుట, పెరుగుట మొదలైన షడ్భావవికారములు లేనిదియు, నిర్ధోషమైనదియు, సత్యజ్ఞానానందస్వరూపమైనదియు, నాశరహితమైనదియు, వికల్పరహితమైనదియు, ఎన్నియో కల్పములకు ఆధారమైనదియు, సర్వభుతాంతర్యామియు, ఆకాశమువలె లోపల వెలుపల వ్యాపించినదియు, అనంతానందస్వభావయుక్తమైనదియు, ఉహకు అందనిదియు, అనుభవముచే తెలుసుకొనదగినదియు, ప్రత్యక్షముగా గోచరించునదియు నగు పరమాత్మను కరతలామలకమువలె సాక్షాత్తుగా సందర్శించి క్రతార్థతను జెంది కామరాగాది దోషములులేనివాడై శమదమాది దైవగుణసంపన్నుడై, మాత్సర్యము, తృష్ణ, ఆశ, మోహము, దంభము, అహంకారము మొదలైన దుర్గుణములు లేనివాడై యుండువాడే, ఇట్టి పుర్వోక్తలక్షణములు కలిగియుండువాడే బ్రాహ్మణుడని వేద, శాస్త్ర, పురాణ, ఇతసముల యొక్క అభిప్రాయము. ఇట్టి లక్షణములు కలిగియుండుటచేతప్ప మరియొక విదముగా బ్రాహ్మణత్వము సిద్ధింపదు. సచ్చిదానందమై అద్వయమై ఆత్మరూపమైనట్టి బ్రహ్మమును ధ్యానించవలయును.

35. శుకరహాస్యోపనిషత్తు:

జీవుడు దేనిని చూచుచున్నాడో, వినుచున్నాడో, వాసన చూచుచున్నాడో, మాట్లాడుచున్నాడో, రుచిచూచుచున్నాడో అదియే ప్రజ్ఞానమని చెప్పబడినది.
బ్రహ్మదేవునియందును, ఇంద్రాదిదేవతలందును, మనుషులందును; గుఱ్ఱము, ఆవు మొదలైన వానియందును ఏకమైన చైతన్యమే బ్రహ్మము. అందుచే నాయందలి చైతన్యము కూడ బ్రహ్మయగును.
పరిపూర్ణమైన పరమాత్మాజ్ఞానమును లొందుటకు యోగమైన ఈ మనుష్యశరీరమునందు, బుద్దికి సాక్షిగా, నిర్వికారమున ప్రకాశించుచున్నదై పరమాత్మ అహమ్ (నేను) అను పదము చెప్పబడుచున్నది.
స్వయముగా పరిపూర్ణమైన పరమాత్మ మహావాక్యమునందు బ్రహ్మమను పదముచే చెప్పబడినది. అస్మి అను పదము జీవ బ్రహ్మైక్యమును తెలుపుచున్నది. అందుచే నేను బ్రహ్మమునే అగుదును.
సృష్టికి పూర్వము నామరూపములు లేనిది, ఏకమైనది అద్వితీయమైనది అగు ఏ సద్వస్తువు కలదో, ఆ సద్వస్తువునకు ఇప్పుడును విచారణచే తత్వముద్వార ఆ స్వభావమే చెప్పబడుచున్నది.
జీవుని యొక్క శరీర, ఇంద్రియాదులకంటె అతీతమైన సద్వస్తువు మహావాక్యమునందు త్వం పదముచే చెప్పబడినది. అసి అను పదముచే ఐక్యము గ్రహింపబడుచున్నది. అట్టి తత్, త్వం పదార్థముల యనుభవమును ముముక్షువు లనుభవింతురు గాక!
అయమ్ అను పదముచే ఆత్మ స్వయం ప్రకాశమైన ప్రత్యక్షమైనది అను అర్థము చెప్పబడినది. అది అహంకారః ఆదిగా గలిగి స్థూల శరీరము నంతముగా గల జగత్తునకంటె విలక్షణమైన ప్రత్యగాత్మయని చెప్పబడుచున్నది.
దృశ్యజగత్తునకెల్ల అధిష్టానమైన వరతత్త్వము బ్రహ్మ శబ్దముచే చెప్పబడుచున్నది. ఆ బ్రహ్మము స్వయంప్రకాశముమైన ప్రత్యగాత్మరూపమే యగును.
జీవుడు కార్యోపాది, ఈశ్వరుడు కారణొపాది కార్యకారణములను విడనాడినచో పూర్ణబోధయే(ఆత్మయే) శేషించును.

ఇతరవిద్యలయొక్క పరిజ్ఞానము అనశ్యము నశ్వరమైన బ్రహ్మవిద్య యొక్క పరిజ్ఞానము బ్రహ్మమును సంప్రాప్తి చేయును.

Monday, March 31, 2014

34.నిరాలంబోపనిషత్తు:

గురుస్వరూపుడును, సచ్చిదానంద మూర్తియును, ప్రపంచ రహితుడును ,శాంతుడును, ఆధారరహితుడును, జేజోరూపుడును అగు శివునకు (మంగళస్వరూపమగు పరమాత్మకు) నమస్కారము.
నిర్గుణబ్రహ్మమును ఆశ్రయించి సగుణకారమును ఎవడు త్యజించునో అతడే సన్యాసి, అతడే యోగి. అట్టివాడు మోక్ష పదము నొందును.                   
అద్వితీయమైనదియు, సకలోపాధివినిర్ముక్తమైనదియు, సర్వశక్తిసంపన్నమైనదియు, ఆదిఅంతములు లేనిదియు, శుద్దమైనదియు, మంగళకరమైనదియు, శాంతమైనదియు, నిర్గుణమైనదియు, అనిర్వచనీయమైనదియు నగు చైతన్యమే బ్రహ్మము.
ఈ సమస్తము బ్రహ్మమే. ఇచట అనేకత్వమొకింతైనను లేదు.       
శరీర, ఇంద్రియ సంశయముచేతను సద్గురూపాసనచేతను ,శ్రవణమనన నిధిధ్యాసములచేతను, ద్రుగ్ద్రశ్యస్వరూపమైనదంతయును సర్వాంతర్యామియై యున్నది. సర్వ సమానమైనది. ఘటపటాది వికారవస్తువులందు వికారరహితమైనది యగు చైతన్యము తప్ప వేరొకటి ఏదియు నిచట లేదను సాక్షాత్కారానుభావమే జ్ఞానము.
త్రాటియందు సర్పభ్రాంతివలె కేవలము సర్వాంతర్యామి సర్వస్వరూపపమునగు బ్రహ్మమునందు దేవతలు, పశువులు, మనుష్యులు, స్త్రీలు, పురుషులు, వర్ణాశ్రమములు, బంధమోక్షములు అను అనేక భేదములచే కల్పితమైన జ్ఞానమే అజ్ఞానము.
అనాత్మరూపములైన విషయములయొక్క సంకల్పమే దుఃఖము.
సజ్జనుల సాంగత్యమే స్వర్గము.
అసత్తైన సంసారముయొక్క విషయములందు ప్రవ్రుత్తులైన అజ్ఞానులతోడి సాంగత్యమే నరకము.
అనాదియగు అజ్ఞానము యొక్క వాసనచే నేను జన్మించినవాడను అను ఈ ప్రకారములైన సంకల్పములు కలిగియుండుటయే బంధము. తల్లిదండ్రులు, సోదరులు, భార్య, బిడ్డలు, గృహము, ఉద్యానము, పొలము మొదలైన వానియందు మమత్వము కలిగి యుండి సంసారముయొక్క ఆవరణమును గూర్చి సంకల్పము కలిగి యుండుటయే బంధము.
కర్త్రుత్వాదులు, అహంకారము వీనిని గుర్చిన సంకల్పమే బంధము. కేవలం సంకల్ప మాత్రమె బంధము.
నిత్యానిత్య వస్తువిచారణచే అనిత్యములైన సంసార సుఖదుఃఖ విషయములగు సమస్త వస్తువులందును మమకారము నశించుటయే మోక్షము.
సర్వజీవుల శరీరములందున్న చైతన్య బ్రహ్మమును పొందించు గురువు ఉపాసింపదగినవాడు.    
సర్వుల అంతరంగమున ఉన్న చిద్రూపమును (ఆత్మను) ఎరిగినవాడే విద్వాంసుడు.
కర్త్రుత్వాది అహంకారభావము గూఢిపడినవాడు మూఢుడు.         
బ్రహ్మము సత్యము ,జగత్తు మిధ్య అను అపరోక్షజ్ఞాన రూపముగు అగ్నిచే బ్రహ్మాద్వైశ్వర్యవాంఛయొక్క సంకల్పమును సముహముగా దగ్ధ మొనర్చుటయే తపస్సు.
ప్రాణము, ఇంద్రియములు మొదలైనవానికంటెను; అంతఃకరణముకంటెను, త్రిగుణములకంటెను, పరమైనదియు, సచ్చిదానంద స్వరూపమైనదియు, సర్వమునకు సాక్షియైనదియు; నిత్యముక్తమైనదియునగు బ్రహ్మముయొక్క స్థానము పరమపదము.
దేశ కాలవస్తు పరిచ్చేదరహిత చిన్మాత్రస్వరూపమే గ్రహింపదగినది.         
స్వస్వరూప వ్యతిరిక్తమైనదియు, మాయామయములగు బుద్ధీంద్రియములకు గోచరమైనదియు నగు జగత్తు సత్యమను చింతనము గ్రహింపదగినది కాదు.

ప్రాపంచికవిషయములనెల్ల పరిత్యజించి నిర్మముండు, నిరహంకారుండునై, తన కిష్టమగు బ్రహ్మమును శరణుజొచ్చి, తత్త్వమసి, అహంబ్రహ్మస్వి, సర్వంఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తేకించన మొదలైన మహావాక్యముల యొక్క అర్ధమును అనుభవమునకు తెచ్చుకొనుటవలన నేను బ్రహ్మమునే యగుదును అని నిశ్చయముగా నెరింగి నిర్వికల్ప సమాధితోగూడి స్వతంత్రుడై యతి సంచరించుచుండును. అతడే సన్యాసి. అతడే ముక్తుడు. అతడే పూజ్యుడు, అతడే యోగి, అతడే పరమహంస. అతడే అవధూత, అతడే బ్రాహ్మణుడు.

3౩. సర్వసారోపనిషత్తు :

జీవుడు అనాత్మరూపములగు దేహాలను ఆత్మగా తలంచుచు అభిమానించుచున్నాడు. ఆ దేహాభిమానమే ఆత్మకుబంధము. అది తోలగుటయే మోక్షము. అట్టి అభిమానమును కలుగజేయు నది అవిద్య. అట్టి అభిమానము తొలగిపోవునో అదియే విద్య.
నేను ప్రాణరహితుడను, మనోరహితుడను, పరిశుద్దుడను. బుద్ధి మొదలైనవానికి సదా సాక్షి భూతుడను. నేను సదా నిత్యుడను, చిన్మాత్రుడను. ఇట స,సంశయ మేమియును లేదు.
నేను స్థానువును (నిశ్చలుండను), నిత్యుడను, సదా ఆనంద స్వరూపుడను ,శుద్దుడను, జ్ఞానస్వరూపుడను, నిర్మలుడను. నేను సమస్త ప్రాణులయొక్క ఆత్మను, సర్వవ్యాపకుడను ,సాక్షిని. ఇందు సంశయము లేదు.
సర్వ వేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేను కాను .నేను నామములను కాను. కర్మలు కాను. సచ్చిదానందమైన బ్రహ్మమును నేను.

నేను దేహమును కాను. కావున జననమరణములు ఇక నా కెచట? నేను ప్రాణమును కాను. కావున ఆకలిదప్పికలు ఇంకా నీ కెచట ? నేను చిత్తమును కాను. కావున శోకమోహములు ఇక నా కెచట? నేను కర్తను కాను. కావున బంధమోక్షములు ఇక నా కెచట?

31. క్షురికోపనిషత్తు ; 32. మన్త్రికోపనిషత్తు :

31. క్షురికోపనిషత్తు :
సాధకుడు నిషబ్దముగానున్న ప్రదేశమున సముచితమైన ఆసనము వేసికొని కూర్చుండి తాబేలు తన అవయవములను ఉపసంహరించుకొనునట్లు సర్వెంద్రియములను విషయములనుండి మరలించి, మనస్సును హృదయమునందు నిశ్చలముగా నిలిపి, పండ్రెండు దాత్రలుగల ప్రణవ మంత్రముతో మెల్లమెల్లగ సర్వాత్మను దారించవలెను.
ఇంద్రియములను అన్నిటిని నిగ్రహించి, నిజిరచిత్తుడై, నిశబ్దమైన ఏకాంతవాసమునందు సంగరహితుడై, సాంగయోగము నెరిగినవాడై, నిరపేక్షుడై, మెల్లమెల్లగా పాశమును త్రెంచుకొని ఎగిరిపోవు హంసపక్షివలె జీవుడు చిన్నపాశుడై సంసారమును దాటి మోక్షధామమును జేరి సుఖించును.
కామబంధమునుండి నిముక్తుడైన వెంటనే జీవుడు సర్వకామరహితుడై, సంసారపాశములను చేధించి అమ్రుతత్వమును (మోక్షమును) పొందును. మరల అతడు బంధమును పొందడు.
32. మన్త్రికోపనిషత్తు :

ఎవని యందు ఈ చరాచర జగత్తు కూర్చబడినదో, ఆ పరిశుభ్రమైన, సర్వవ్యాపకమైన ,అద్వితీయమైన పరమాత్మను బ్రహ్మనిష్టులు దర్శించుచుందురు. మఱియు నదులు సముద్రము నందువలె అతనియందు లయమును బొందుచుందురు.

౩౦. సుబాలోపనిషత్తు :

శరీరము లోపల హృదయగుహయందు అజుడు, నిత్యుడు, అద్వితీయుండు నగు పరమాత్మా కలడు. అతనికి ప్రుథివి శరీరము. అతడు ప్రుథివిలో సంచరించును. కాని అతనిని ప్రథివి ఎరుగనేరదు. అట్లే అతనికి జలము శరీరము. అతడు జలమునందు సంచరించును .కాని జల మాతనిని ఎరుగలేదు.
ముముక్షువు శాంతుడు ,దాంతుడు, ఉపరతుడు. తితిక్షువు సమాధినిష్టుడుగ నయి తన అంతరాత్మయందే పరమాత్మను దర్శించుచున్నాడు. ఆ పరమాత్మ నెరిగిన విజ్ఞుడు సర్వముయోక్క ఆత్మయగుచున్నాడు.

బ్రహ్మనిష్టుడు మహత్తరమగు అత్మపదము నెరిగినవాడై వృక్షముక్రింద నివసింపవలయును. వైరాగ్యశీలుడు, వివేకవంతుడు, ముముక్షువు నగు ఆ విజ్ఞుడు పరిమితవస్త్రమును ధరించిన వాడై,  అన్యసహాయము లేనివాడై, ఏకాకియై, సమాధినిష్టుడై, ఆత్మకాముడు, ఆప్తకాముడు, నిష్కాముడు, జీర్ణకాముడునై ఏనుగునందును, సింహమునందును, ఈగనందును, దోమయందును, ముంగిసయందును, గంధర్వునియందును భగవంతుని యొక్క రూపములు తెలిసికొని దేనివలనను భయముజెందని వాడై యుండును. చేదింపబడుచున్న వాడైనను వ్రుక్షమువలె క్షమాశీలుడై కోపముంజెంచక యుండవలెను. సత్యశీలుడై యుండవలెను. పరమాత్మ సత్యస్వరూపమైనది.

29. మైత్రేయోపనిషత్తు:

(శిష్యుడు గురువుతో నిట్లనెను) మహాత్మా! చెరువులోని గ్రుడ్డికప్పవలె నేను ఈ సంసారమందున్నాను. నన్ను ఉద్దరింపుడు. ఈ ప్రపంచమున నాకు మీరే దిక్కు.
గురువు మనుజునకు దృశ్య విషయములందు మనస్సు ఏ విధముగా ఆసక్త మగుచుండునో, ఆ ప్రకారముగ బ్రహ్మమునందు ఆసక్తమగునో, అప్పుడిక ఎవడు బంధమునుండి విదివడకుండును?
బుద్దివ్రుత్తులకు సాక్షియు, పరమ ప్రేమామూర్తియు నగు పరమేశ్వరుని హృదయకమల మధ్యమందు భావనచేయవలెను.
మనుజునకు ఏది ఆనందసముద్రమో అదియే నేను. ఆ ఆనంద సముద్రము మనోబుద్దుల కంటే పరమైనది. ఇందు సంశయము లేదు.
అంతరంగమున ఆనందమును ఆశ్రయించువాడను, ఆశయను పిశాచమును అవమానపరచువాడను, ఈ జగత్తును ఇంద్రజాలము (గారడీ) వలే గాంచువాడను, అసంగుడను అగు నాకు ఆపదయెట్లు కలుగగలదు?
దేహము దేవాలయమని చెప్పబడినది. జీవుడు కేవలము శివుడే అయియున్నాడు. అజ్ఞానము నిర్మాల్యమును తొలగించి సోహం భావనచే (ఆ పరమాత్మనే నేను అను భావనచే) పూజించవలెను.
అభేధదర్శనమే జ్ఞానము. మనస్సును నిర్విషయముగ (విషయసంకల్పము లెవ్వియులేక) నున్చుతయే ధ్యానము. మనస్సు నందలి మాలిన్యమును, అపవిత్రతను తొలగించుటయే స్నానము. ఇంద్రియనిగ్రహమే శౌచము.
బ్రహ్మానందమను అమృతమును త్రాగవలెను. దేహ సంరక్షణ కొఱకు బిక్షాటన మాచరింపవలెను. ద్వైతవర్జితమగు ఏకాంతమున వసించవలెను. ఈ ప్రకారముగా బుద్ధిమంతుడు ఆచరించినచో మోక్షమును బడయగలడు.
ఈ దేహము పుట్టునదియు, చచ్చునదియు అయియున్నది. ఇది మాతాపితృ మలస్వరూపమైనది. సుఖదుఃఖములకు నిలయమైనది. అపవిత్రమైనది.
చర్మము, మాంసము, ఎముకలు మొదలైన ఏడూ విధములైన ధాతువులతో కూడినదియు, మహారోగగ్రస్తమైనదియు, పాపనిలయమైనదియు, అస్తిరమైనదియు, వికారములతో కూడిన ఆకారము కలదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
సదా స్వభావముగానే తొమ్మిది రంధ్రములనుండి మలమును స్రవించునదియు, దుర్గంధముతోను, దుర్మలములతోను కూడినదియుగను ఈ శరీరమును తాకినచో స్నానము చేయవలెను.
మాత్రుసూతకముతో సంబందము కలదియు, సూతకముతో పుట్టినదియు, మృతసూతకమును కలుగజేయునదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
నేను నాదియను అజ్ఞానమువలని అశౌచమును తొలగించుకొనుట శుద్ధశౌచమని చెప్పబడినది. కేవలము మట్టితోను, నీటితోను కలుగజేసికోను శౌచము లౌకికశౌచమే యగును.
వాసనాత్రయమును (లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అను మూడింటిని) పోగొట్టుకొనుటయను శౌచము చిత్తమును శుద్ధ మొనర్చును. జ్ఞానమను మ్రుత్తికతోను, వైరాగ్యమను బలముతోను కడుగుటవలన అది శౌచమననడుచున్నది.
అద్వైతభావనయే భక్ష్యము (భోజనము). ద్వైతభావన భక్ష్యము కాదు. గురువు, శాస్తములు చెప్పిన భావము ప్రకారము సాధకుడు భిక్షువునకు భోజనము విధింపబడుచున్నది.
బుద్ధిమంతుడు సన్యాసానంతరము స్వస్థానమున విడచి ,కారాగారమునుండి విడువబడిన చోరునివలె స్వతః దూరముగ నివసింపవలెను.
ఎపుడు మనుజుడు అహంకారమను కుమారుని, ధనమను సోదరుని, మొహమను ఇంటిని ఆశయను భార్యను వదలివేయునో అపుడాతడు నిస్సంశయముగా ముక్తినోందును.
హృదయాకాశమునందు చిదాత్మయను సూర్యుడు సదా ప్రకాశించుచున్నాడు. అతడు అస్తమించుటలేదు, ఉదయించుటలేదు.
గురువాక్యములచే అద్వితీయమగు పరమాత్మా యొకటియే కలదు అను నిశ్చయము కలిగియుండుటయే ఏకాంతమని చెప్పబడినది కాని, మరముగాని, వసాంతరముగాని ఏకాంతములు కావు.
సంశాయరహితులైన వారికే మోక్షము కలుగును. సంశయగ్రస్తులైనవారికి జన్మజన్మాంతరమందను మోక్షము కలుగదు. కాబట్టి గురుశాస్త్రాదులందు విశ్వాసము కలిగియుండవలెను.
కర్మత్యాగము సన్యాసము కాదు. వ్రేషోచ్చారనమును సన్యాసము కాదు. జీవాత్మల యొక్క ఐక్యమే సన్యాసమని చెప్పబడినది.
సమస్తములైన విషయభోగములందు ఎవరికీ వామమాహారము (వాంతిఅన్నము) నందువలె హేయభావము కలుగునో, దేహభీమానరహితుడైన అట్టివానికే సన్యాసము నందు అర్హత కలదు.
సమస్త పదార్థముల యెడల ఎపుడు మనస్సునందు వైరాగ్యము కలుగునో, అపుడు మాత్రమె బుద్ధిమంతుడు సన్యసింప వలయును. లేకున్న పతితుడు కాగలడు.
డబ్బుకొరకుగాని, అన్నవస్త్రములకొరకుగాని, ప్రతిష్టకోరకుగాని సన్యసించినచో ఉభయ భ్రష్టుడు కాగలడు. అట్టి వాడు మోక్షమును పొందుటకు తగడు.
(బ్రహ్మ) తత్త్వచింతనము ఉత్తమమైనది. శాస్త్రచింతనము మధ్యమమైనది. మంత్రచింతనము అధమమైనది. తీర్థయాత్ర అధమాధమమైనది.
మూఢుడు అనుభూతిలేకయే బ్రహ్మమును గూర్చి వాచాచర్చలు సాగించి సంతోషించుచుండును. అట్టివాడు నీటిలో ప్రతిబింబించిన కొమ్మ చివరిపండ్లను భుజించి సంతోషించువానివలెనే ఉండును.
యతి మాధుకరము (భిక్షాటనము) అను తల్లిని, వైరాగ్యమను తండ్రిని, శ్రద్దయను భార్యను జ్ఞానమను కుమారుని వదలి పెట్టనిచో ముక్తుడగును.
ధనవ్రుద్దులు, వయోవ్రుద్దులు, విధ్యావ్రుద్దులు అందరును జ్ఞానవ్రుద్దునకు భ్రుత్యులే యగుదురు. ఇంతియే కాదు. అతని శిష్యులకును భ్రుత్యులే యగుదురు.
కొందరు పండితులైయున్నను నా మాయచేత మోహితమైన చిత్తముకలవారై, అంతట నిండియున్న ఆత్మనగు నన్ను పొందజాలక కేవలము ఉదరమును నింపుకొనుట కొరకై కాకుల వలె అచ్చటచ్చట సంచరించుచున్నారు.  
యతి శిలామయములును, లోహ మయములును, మణిమయములును ,మృత్తికామయములును అను విగ్రహములును కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షముకొరకై బహ్యార్చనమును విడచిపెట్టవలెను.          
సముద్రముసం దుంచబడిన నిండుకుండవలె పరమాత్మా లోపల, వెలుపల పరిపూర్ణమైనది. మఱియు ఆకాశమునం దుంచబడిన శూన్యఘటమువలె లోపల, వెలుపల (దృశ్య) శూన్యమైనది.
నీవు గ్రాహ్యపదార్థము కావలదు. గ్రాహకపదార్థమున్ను కావలదు. సమస్తభావనలను విడనాడి ఏది శేషించునో, అట్టి ఆత్మతో తన్మయుడవై యుండుము.
ద్రుష్ట, దర్శనము దృశ్యము అను త్రిపుటిని వాసనలతో గూడ విడనాడి ,సర్వదా ప్రకాశమానమైనట్టి కేవలము ఆత్మనే భజింపుము.
సమస్త సంకల్పములు నిశ్శేషముగా శమించినట్టియు, శిలవంటి స్థితిని పోలినదియు, జాగ్రద్దశ, నిద్రాదశ లేనిదియు నగు ఏ స్థితి కలదో, అదియే శ్రేష్టమైన (ఆత్మ) స్వరూపస్థితి అయియున్నది.
నేను అనేకత్వ భేదము లేనివాడను; అఖండానంద స్వరూపుడను, అహంకారము లేనివాడను ;నేను కాను (లేక దృశ్యపదార్ధమును కాను), నేను దేహాదిరహితుడను అయియున్నాను.
నేను సర్వత్ర పరిపూర్ణమైన స్వరూపము కలవాడను; సచ్చిదానంద స్వరూపుడను; సర్వ తీర్థ స్వరూపుడను, పరమాత్మను, శివ (మంగళ) స్వరూపుడను అయియున్నాను.
నేను అఖందానంద స్వరూపుడను, అఖండాకారరూపుడను, ప్రపంచరహితచిత్తుడను, ప్రపంచరహితుడను అయియున్నాను.
నేను సర్వప్రకాశరూపుడను, చిన్మాత్రజ్యోతిస్వరూపుడను కాలత్రయవర్జితుడను, కామాదిరహితుడను అయియున్నాను.
నేను గస్తవ్యమగు ప్రదేశము లేనివాడను, గమనాది రహితుడను, సదా సమరూపుడను, శాంతుడను, పురుషోత్తముడను అయియున్నాను.

ఈ ప్రకారముగ స్వానుభవ మెవనికి కలిగియుండునో అతడు నేనే అయియున్నాను. ఇట సంశయము లేదు. దీనిని ఒకసారి అయినను ఎవడు వినునో అతడు స్వయముగా బ్రహ్మమే యగుచున్నాడు.

28. కాలాగ్నిరుద్రోపనిషత్తు :

సనత్కుమారుడు త్రిపుండ్రధారణ యొక్క వివరమును గూర్చి భగవంతుడు కాలాగ్నిరుద్రుని యడుగగా వారిట్లు చెప్పిరి త్రిపుండ్రధారణ లలాటముపై భ్రూమధ్యము గుండా మూడు రేఖలతో గావింపబడును. అందు మొదటి రేఖ గార్హపత్యాగ్నిని, ఆకారమును, రజోగుణమును, భూర్లోకమును, స్వాత్మను, క్రియాశక్తిని, ఋగ్వేదమును,ప్రాతర్యజ్ఞమును, మహేశ్వరదేవతను సూచించును. రెండవ రేఖ దక్షిణాగ్నిని, ఉకారమును, సత్వగుణమును, అంతరిక్షమును, అంతరాత్మను, ఇచ్చాశక్తిని, యజుర్వేదమును, మాధ్యందినయజ్ఞమును, సదాశివదేవతను సూచించును. మూడవ రేఖ ఆహవనీయాగ్నిని, మకారమును, తమోగుణమును, ధ్యోర్లోకమును, పరమాత్మను, జ్ఞాపకశక్తిని, సామవేదమును, తృతీయయజ్ఞమును, మహాదేవదేవతను సూచించును. ఈ ప్రకారముగా త్రిపుండ్రవిధిని భస్మముతో చేయువాడు విద్వాంసుడైనను, బ్రహ్మచారియైనను, గృహస్థుడైనను, వానప్రస్థుడైనను, సన్యాసియైనను, మహాపాపములనుండి విముక్తుడై పవిత్రుడగును. సమస్త తీర్థములయందు స్నానము చేసిన వాడగును. వేదములన్నిటిని అధ్యయనము చేసినవాడగును. దేవతలందరినీ యెరిగిన వాడగును (పూజించినవాడగును). సదా సమస్త రుద్రమంత్రములను జపించినవాడగును. సమస్త భోగములను అనుభవించినవాడగును. దేహమును వదలిన పిదప అతడు శివసాయుజ్యమును పొందును. అతడు తిరిగి ఈ సంసారమునందు జన్మింపడు.

27-1. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు ; 27-2. నృసింహొత్తరతాపిన్యుపనిషత్తు :

27-1. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు :
ఈ పరమాత్మా సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, సమస్త జగత్తునకు జన్మస్థానమైనవాడు. ప్రాణికోట్లయొక్క జనన మరణములకు ఆధారభూతుడు.
27-2. నృసింహొత్తరతాపిన్యుపనిషత్తు :
ఆత్మ నిత్యానందస్వరూపమైనది. సత్యమైనది. ఏకరసమైనది. నేత్రేంద్రియమునకు ద్రుష్టమైయున్నది. అట్లే శ్రోత్రేంద్రియమునకు, వాగింద్రియమునకు, మనస్సునకు, బుద్దికి, ప్రాణమునకు, తమస్సునకు, సమస్తమునకు ద్రుష్టమైయున్నది. కావున ఆత్మ సర్వమున కంటె విలక్షణమైనది. ఆత్మ నేత్రమునకు సాక్షి. అట్లే శ్రోత్రమునకు, వాక్కునకు, మనస్సునకు, బుద్దికి, ప్రాణమునకు, తమస్సునకు, సమస్తముకు సాక్షియైయున్నది. కావున అది అవికారమైనది. మహాచైతన్యస్వరుపమైనది. ఈ సమస్త జగత్తుకంటె అత్యంత ప్రియమైనది. ఆనందఘనమైనది. ఈ సమస్త ప్రపంచమునకు ఎదుట మిగుల భాసించునది, ఏకరసమైనది, అజరమైనది, అమరమైనది, అభయమైనది, బ్రహ్మస్వరూపమైనది అయియున్నది.
అద్వితీయ మగుటచే ఈ ఆత్మ వికల్పరహితమైనది. ఈ ఓంకారము వికల్పరహితమైనది. ఈ ఓంకారము జ్ఞానస్వరూపమైనది. ఈ సమస్త జగత్తు వాస్తవముగా జ్ఞానస్వరూపమే యగును. ఆత్మ వికల్పరహితమైనది. ఇందు ఎంతమాత్రమును భేదము లేదు. ఆత్మ యందు భేదములు గాంచువాడు నూరు ఖండములుగాను, వేయి ఖండములుగాను వ్రక్కలై మృత్యువుపాలగుచుండును. ఈ జగత్తు అత్మస్వరూపమే యగును. ఆ ఆత్మ అద్వైతము, స్వయంప్రకాశము, మహానందము, అమరము, అభయము నగు బ్రహ్మమే యగును. అభయమైన బ్రహ్మము నెరుగు విజ్ఞుడు బ్రహ్మస్వరూపుడే యగును. ఇది పరమరహస్యమైనది.

అద్వాతమైన ఈ ఆత్మ స్మూత్రస్వరూపమైనది. నిత్యమైనది. బుద్దమైనది. సత్యమైనది. ముక్తమైనది. అసంగమైనది. వ్యాపకమైనది. అద్వైతానందస్వరూపమైనది. పరతత్వమైనది.ఏకరసమైన ప్రత్యగాత్మయైనది. ఈ ప్రమాణములచే నేరుంగబడు సన్మాత్రస్వరూపమైనది. ఆత్మ స్వీయ మహీమయందుండునది.నిష్కామమైనది. స్వయంప్రకాశస్వరూపమైన ఏకైక సాక్షి అయియున్నది.

25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు ; 26. బృహజ్జాబాలోపనిషత్తు :


25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు :
విజ్ఞుడగువాడు (ఆధ్యాత్మిక సాధనలద్వారా) సమస్త పదార్థములకంటెను శ్రేష్టమైనట్టి స్వారాజ్యమును (మోక్షమును), ఆత్మ సామ్రాజ్యాదిపత్యమును పొందుచున్నాడు.

26. బృహజ్జాబాలోపనిషత్తు :

ఎచట సూర్యుడు వేలగడో, ఎచట వాయువు వీయదో, ఎచట చంద్రుడు వేలుగడో, ఎచట నక్షత్రములు భాసిల్లవో, ఎచట అగ్ని దహించదో, ఎచట మృత్యువు ప్రవేసించదో, ఎచట దుఃఖములు ప్రవేసింపవో, ఏది సదానందమై, పరమానందమై, శాంతమై, శాశ్వతమై, సదా మంగళ స్వరూపమై, బ్రహ్మాదిదేవతానందితమై యోగిజనధ్యేయమై యున్నదో, దేనిని పొంది జనులు తిరిగి జన్మను పొందారో అదియే పరమాత్మస్థానము.

2౩. అధర్వశిఖోపనిషత్తు ; 24. మైత్రాయణ్యుపనిషత్తు :

2౩. అధర్వశిఖోపనిషత్తు :
ఇతరమైన సమస్తమును పరిత్యజించి శినంకముడైన (మోక్షము నొసంగువాడైన) శివునే (శుభ్రప్రదుడైన పరమాత్మను) ఒక్కనినే ధ్యానించవలెను.
24. మైత్రాయణ్యుపనిషత్తు :
(బృహద్రధుడను రాజు శాకాయన్యుడను ఋషి నిట్లు అడిగెను).
మహాత్మా! ఎముకలు ,చర్మము, నరములు, మజ్జ, మాంసము ,శుక్లము, శోణితము, శ్లేషము ,కన్నీరు – వీనిచే దూషితమైనదియు ,మలమూత్రములచే వాతపిత్తకఫలములచే దుర్లంధమైనదియు ,సారహీనమైనదియు నగు ఈ శరీరమునందు కామభోగములచే జనులకు కలుగులాభమేమి?
మహాశయా! కామము, క్రోధము, లోభము, మోహము, భయము, విషాదము ,ఈర్ష్య, ఇష్టజనవిరహము, అనిష్టప్రాప్తి ,ఆకలి, దప్పిక, ముసలితనము,మరణము ,రోగము, శోకము మొదలైన వానిచే అభిహతమైన ఈ శరీరమునందు కామభోగాములచే కలుగు లాభమేమి?
ఈ ద్రుశ్యజగత్తు అంతయు నాశవంతముగా కనబడుచున్నది. ఈ ఈగలు ,దోమలు మొదలైన కీటకములు పచ్చగడ్డివలె పుట్టుచు, గిట్టుచు, నశ్వరములై యున్నవి.
గొప్ప ధనుర్దారులైన చక్రవర్తులు కొందరు కలరు. వారు అంతా బహుసంఖ్యాకములైన ధనసంపదలను వారు త్యజించివేసి ఇహలోకమునుండి పరలోకమునకు పోయిరి. 
మహాసముద్రములు ఎండిపోవుచున్నవి, పర్వతములు కూలిపోవుచున్నవి, ధ్రువనక్షత్రములు సంచలించుచున్నది, చెట్లు నిలుచుటలేదు. భూవలయము మునిగిపోవుచున్నది. దేవతలు స్థాన భ్రస్టులగుచున్నారు. ఇట్టి సంసారమునందు కామభోగములచే కలుగు లాభమేమి? కమభోగాశ్రయుడైన జీవుడి లోకమున అనేక జన్మలను బొందుచుండుట కానబడుచున్నది. పూజనీయ! సెలవిండు, మీరే మాకు దిక్కు!
రాజా! పరిశుద్దమైన జీవుడు ఈ శరీరమునుండి నిష్క్రమించి పరంజ్యోతిలో ఐక్యమవును. ఇదియే ఆత్మ. ఇది అద్భుతమైనది. అభయమైనది. ఇదియే బ్రహ్మము.
పరమగు ఈ ఆత్మ పరిశుద్దమైనది ,స్థిరమైనది, నిశ్చలమైనది, అసంగమైనది, అవ్యగ్రమైనది, నిస్ప్రుహమైనది. నాటకమునుగాంచు ప్రేక్షకుని భంగి యుండునది. గుణమయమైన వస్త్రముచే తన స్వరూపమును అచ్ఛాదించుకొనియుండునది అయియున్నది.
శబ్దము, స్పర్శము మొదలైన విషయములు మనుష్యులకు అనర్ధములవలె నున్నవి. అనర్ధకములైన అట్టి విషయములందు ఆసక్తుడైన జీవుడు పరంధామమైన మోక్షమునుగూర్చి తలంచుటలేదు.
తపస్సుచే సత్వగుణము కలుగును. సత్వగుణముచే పరిశుద్దమైన మనస్సు ఏర్పడును. అట్టి పరిశుద్ద మనస్సుద్వార ఆత్మ లభించుచున్నది. ఆత్మ లాభముచే జీవునకు పునరావృత్తిరహిత కైవల్యము సంప్రాప్తించుచున్నది.
కట్టెలు లేని అగ్ని తనయందే తానూ ఉపశమించునట్లు, వృత్తులు (సంకల్పములు) నశించుటచే మనస్సు తనయందే తాను ఉపశమించుచున్నది.
చిత్తమే సంసారము. చిత్తమును ప్రయత్నపూర్వకముగా శుద్ధ మొనర్పవలయును. చిత్తము ననుసరించి స్వభావము, చేష్టలు, అభ్యాసములు కలుగుచుండును. ఇది పురాతనమైన రహస్యము.
చిత్తముయొక్క నిర్మలత్వముచే జీవుడు కర్మలను నశింపజేయుచున్నాడు. పరిశుద్ద మనస్సుకలవాడు ఆత్మయందు స్థితుడై అక్షయసుఖ మనుభవించుచున్నాడు.
మనస్సు శుద్దమని, అశుద్దమని రెండు విధములుగా చెప్పబడింది. కామసంకల్పములతో కూడినది అశుద్దమనియు, కామవర్జితమైనది శుద్ధ మనియు ఎరుంగవలయును.
మనస్సును లయ, విక్షేపరహితముగాను, మహానిశ్చలముగను గావించి ధ్యానశీలుడు అమనస్కభావమును ఎపుడు పొందునో, అపుడు పరమాత్మపదమును బడయును.
సాధకుడు తన హృదయమందలి సంకల్పములు నిశ్సేషముగా నశించిపోవువరకు మనస్సును నిగ్రహించవలయును. సంపూర్ణ మనోనిగ్రహమే జ్ఞానము. అదియే మోక్షము. ఇక తక్కిన బోధలన్నియు గ్రంధవిస్తారమే యగును.
నిశ్చల సమాధినిష్టచే మనోమాలిన్యము తొలగిపోగా, అట్టి నిర్మల మనస్సు ఆత్మయందు ఉంచబడినపుడు కలుగు సుఖమును వాక్కుతో వర్ణించుటకు శక్యము కాదు. ఆ సుఖము స్వయముగా తన అంతఃకరణము ద్వారానే అనుభవింపబడగలదు.
ఈ అక్షరపరబ్రహ్మము మహా పవిత్రమైనది. దీని నెరిగిన వాడు ఏది కోరునో అది వానికి లభించును.

తీవ్ర వైరాగ్యశాలియగు సాధకుడు సర్వజీవులకును అభయమొసంగి, ఎకాంతమునకు పోయి శబ్దాది విషయములను తననుండి బహిష్కరించి పరిశుద్దాత్ముడై, తన శరీరమునుండియే (అంతరంగ మందు) పరమాత్మను పొందును.

Sunday, February 16, 2014

22. అధర్వశిరోపనిషత్తు :



ఉచ్చరింపగనే శరీరమంతను పైకి లేవదీయును కాబట్టి ఓంకారము అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే ఉచ్చరించు బ్రహ్మనిష్టులకు ఋగ్యజుస్సామాధర్వణవేదములను, షడంగములు మున్నగు వానిని జపయజ్ఞము నందు బ్రహ్మమును పొందింపజేయును. కావున ఓంకారము (ప్రణవము) అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే గర్భ, జన్మ, జరామరణరూప సంసారము యొక్క మహాభాయము నుండి తరింపజేయును, కావున ఓంకారము తారమని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే వృద్దిని పొందుటవలన ఇతరములైన వానిని (జ్ఞానాదులను) వృద్దిని పొందింపజేయుటవలన ఓంకారము పరంబ్రహ్మ అని చెప్పబడుచున్నది.
సమస్త పదార్థములను చూచుచుండుటవలనను, ఆత్మజ్ఞానమును కలుగజేయుటవలనను, యోగమును (జీవబ్రహ్మైక్యమును) పొందింపజేయుటవలనను, పరమాత్మ భగవాన్ అని చెప్పబడుచున్నాడు.
ఓ జనులారా! ఈ ఏకరూపుడై స్వయంప్రకాశుడైన దేవుడు సమస్త దిక్కులను, అహంతర దిక్కులను వ్యాపించియున్నాడు. అతడే సర్వులకు పుర్వుడుగా ఉదయించెను. మరియు బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు, అతడే పుట్టబోవువాడు. అతడు ప్రత్యగాత్మ స్వరూపుడు, సర్వతోముఖుడు అయి యున్నాడు.
కేశాగ్రభాగ(సూక్ష్మ) పరిమాణము కలిగియున్నవాడును, హృదయమందుండువాడును, విశ్వస్వరూపుడును, స్వయంప్రకాశుడును, వేదమునకు ఉత్పత్తిస్థానమైనవాడును, శ్రేష్టుడును, అంతఃకరణమున ఉన్నవాడును అగు పరమాత్మను ఏ ధీరులు చూచుచున్నారో అట్టివారికి శాశ్వతమగు శాంతి కలుగునుగాని ఇతరులకు కాదు.
ఒక్కడగు ఏ పరమాత్మ ప్రతి శరీరమునందును వెలయుచున్నడో, ఎవనిచే ఈ పంచవిధమైన సకల ప్రపంచము స్థితిని బొందియున్నదో, సర్వనియంతయు పరిపూర్ణుడును, స్వయంప్రకాశుడును, స్తుతింపదగినవాడును అగు అట్టి పరమాత్మను ధ్యానించవలయును. అట్టి ధ్యానముచే సంసారతారకమగు మహత్తర శాంతిని మనుజుడు చక్కగా పొందుచున్నాడు.
అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే భస్మము, ఆకాశమే భస్మము, ఈ సమస్తము భస్మము, మనస్సు, ఈ నేత్రాది ఇంద్రియములను భస్మమే. అగ్నిరితిభస్మ ఈ మున్నగు ఏడు మంత్రములచేత భస్మమును గ్రహించి, దేహమునకు పూసికొని శిరస్సు మొదలగు అవయవములను తాకవలెను .అందుచేత ఈ వ్రతము పాశుపతము అనబడుచున్నది. ఇది అజ్ఞానులగు జీవులయొక్క అజ్ఞాన, తత్కార్యములయొక్క విమోక్షణము కొఱకు అయియున్నది.

Tuesday, January 28, 2014

21. అమృతనాదోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

బుద్ధిమంతుడు శాస్త్రములను బాగుగా అధ్యయనము చేసి, అందలి ధర్మములను మరల మరల అభ్యాసము చేసి పరబ్రహ్మమును తెలిసికొని, ఆ పిదప కోరదగినవి కాని వాటినన్నిటిని త్యజించవలెను.
ఓంకారమను రధమునెక్కి, విష్ణుమూర్తిని సారధిగా జేసికొని పరబ్రహ్మ స్థానమును వెదకుచు రుద్రారాధన తత్పరుడవై యుండవలెను.
బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రాధమార్గ మున్నంతవరకు రాధాములోపోయి, తదుపరి రధమును వీడి బ్రహ్మలోకమున కేగవలెను.
శబ్ద, స్పర్శాది విషయములైదు, అతిచంచలమగు మనస్సు అను పగ్గములను వశమునందుంచుకొని, సంయమశీలుడై యుండుట ప్రత్యాహార మనబడును.
ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామం, ధారణ, సత్యా సత్య విచారణ, సమాధి అను ఆరు అంగములు యోగమని చెప్పబడును.
పర్వత (గైరిక) ధాతువులను కొలిమిలో పెట్టి ఊదుటవలన, వాని యందలి మాలిన్యము తొలగి పోవునట్లు, ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామముచే నశించిపోవు చున్నవి.
ప్రాణాయామముచే మనస్సునందలి దోషములను నశింపజేయవలెను. ధారణీలతో పాపమును నశింపజేయవలెను. ప్రత్యాహారముచే సంసర్గదోషములను నశింపజేయవలెను. ధ్యానముచే అనాత్మీయములైన ప్రాకృతగుణములను నశింప చేయవలెను.
పాపమును నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గూర్చి చింతన చేయవలెను.
న్యాహృతితో కూడినదియు, ఓంకారసహితమైనదియు నగు గాయత్రిమంత్రమును శిరస్సుతో గూడ ప్రాణసంయమశీలుడైన సాధకుడు మూడుసార్లు పఠించవలెను. అయ్యది ప్రాణాయామమనబడును.
గ్రుడ్డివానివలె రూపములను చూడుము. చెవిటివానివలె శబ్దములను వినుము. దేహమును కొయ్యవలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణమై యున్నది.
సంకల్పరూపమైన మనస్సును విచారణచే బాగుగా తెలిసికొని బుద్ధిమంతుడు తన యా మనస్సును ఆత్మయందు స్థాపించి, ధ్యానశీలుడై యుండుట ధారణ యనబడును.
వేదములను అనుగుణ్యముగా ఊహించుట తర్కమని చెప్పబడును. దేనిని పొంది సర్వత్ర సమముగా నున్న పరబ్రహ్మమందు నిలుకడగలగి యుండునో అది సమాధియని చెప్పబడును.
ఏకాక్షరమును, బ్రహ్మస్వరూపమును అగు ఓంకారముతో బ్రహ్మధ్యానపూర్వకముగా రేచకము సలుపవలెను. ఈ ప్రకారముగా దివ్యమంత్రముతో అనేక పర్యాయములు రేచకాదులను సలుపుచు, మనస్సునందలి దోషములెల్ల నశించి పోవువరకు ఆ ప్రకారము జపధ్యానాదులను గావించుచుండవలెను.
అడ్డముగాని, నిలువుగాని, క్రిందుగాను ప్రసరించునట్టి దృష్టినివీడి ధ్యానశీలుడు స్థైర్యము కలవాడై, నిశ్చల శరీరుడై సదా యోగమును లెస్సగా అభ్యాసము చేయవలెను.

ధ్యానపరుడైన యోగి భయమును, క్రోధమును, సోమరితనమును ,అతినిద్రను, అతిజాగారనమును, అధికాహారమును ,ఆహారములేమిని, సదా వర్జించవలెను.   

Wednesday, January 15, 2014

20. అమ్రుతబిందూపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరికలుకల మనస్సు ఆశుద్దమును, కోరికలులేని మనస్సు శుద్దమును అగును.
మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.
విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందు వలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయ రహితముగా చేయవలెను.
విషయమందలి ఆశక్తిని వదలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎపుడు మనస్సు సదా ఆత్మ స్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము(స్థానము) కాగలదు.
హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతన అగు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము, తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాగలవు.
ఆ బ్రహ్మము నిష్కలమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మము నేను అని తెలిసికొనిన యెడల మనుజుడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.
నిర్వికల్పమై, అనంతమై, కారనవర్జితమై, దృష్టాంతరహితమై అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞానీ బంధమునుండి విడివడు చున్నాడు.
నిరోధము లేదు, ఉత్పత్తిలేదు, బద్దుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు ఇదియే పరమార్ధ తత్త్వము.
మననము చేయదగిన ఆత్మ జాగ్రత్ ,స్వప్న, సుషుప్తులయందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలను దాటినవానికి పునర్జన్మము లేదు.
ప్రాణులకు అత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రానులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రునివలె ఒకటిగాను ,అనేకము గాను కనుపించుచున్నది.
శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపబడి యుండువాడు ఆ మాయమగు అందకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు). ఆ అంధకారము తొలగినచో ఏకమైన స్థితిని ఒక్కడుగానే చూచుచున్నాడు.  
ప్రణవశబ్దమునందు నాశరహితమైన శ్రేష్టమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవశబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నాడో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించవలెను.
బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంధములను బాగుగా అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుడై, ఆ తదుపరి ధ్యానమును కోరువాడు పొత్తును వదలివేయునట్లు ఆ గ్రంధము నన్నిటిని వదిలి వేయవలెను.
ఆవులు పలురంగులు కలవి అయియున్నవి, వాని యొక్క పాలు ఒకేవర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలలాంటిది.
పాలయందు నేయి నిగూడముగా నుండునట్లు ప్రతిప్రాణి యందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగా నున్నది. సదా మనస్సును మధించి ఆ అత్మయను నవనీతమును వెలువరించవలెను.     
మనుజుడు జ్ఞాననేత్రము కలవాడై మనస్సును మదించి నిష్కలమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూత మొనర్చుకొనవలెను.
సమస్త ప్రాణులకు ఆధారముగా నున్నవాడనై, సమస్త ప్రాణులందు నివసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచున్న వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే నేను.

19. పరమహంసోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

పరమహంసయగువాడు తనచిత్తమును నాయందే (భగవంతుని యందే) స్థాపించును. కాబట్టి నేనును అతనియందు ఉండుచున్నాను.
పరమహంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును (బ్రహ్మాండ భావమును) కూడ వదలివైచి (ఆత్మపరాయణుడై) యుండును.   
పరమహంస తన దేహమును శవము మాడ్కి (జడముగ) చూచును.
పరమహంస కోరిక లన్నింటిని త్యజించివైచి అద్వైత పరమాత్మయందు మనస్సును స్థాపించియుండును.
జ్ఞానదండమును ఎవడు ధరించునో అతడు ఎకదండి సన్యాసి యనబడును.
ఎవడు కేవలము కాష్టదండమును మాత్రము గ్రహించిన వాడను, ప్రాపంచిక భోగము లన్నింటిని అనుభావించువాడును, ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడును, తితిక్ష (ఓర్పు), జ్ఞానము, వైరాగ్యము, శమదమాదిగుణములు లేనివాడును, భిక్షాచరణ మాత్రముతో కాలమును గడపువాడును అయియుండునో అతడు పాపియు యాత్యాశ్రమవృత్తిని నశింపజేసినవాడును అగును.