Monday, March 31, 2014

29. మైత్రేయోపనిషత్తు:

(శిష్యుడు గురువుతో నిట్లనెను) మహాత్మా! చెరువులోని గ్రుడ్డికప్పవలె నేను ఈ సంసారమందున్నాను. నన్ను ఉద్దరింపుడు. ఈ ప్రపంచమున నాకు మీరే దిక్కు.
గురువు మనుజునకు దృశ్య విషయములందు మనస్సు ఏ విధముగా ఆసక్త మగుచుండునో, ఆ ప్రకారముగ బ్రహ్మమునందు ఆసక్తమగునో, అప్పుడిక ఎవడు బంధమునుండి విదివడకుండును?
బుద్దివ్రుత్తులకు సాక్షియు, పరమ ప్రేమామూర్తియు నగు పరమేశ్వరుని హృదయకమల మధ్యమందు భావనచేయవలెను.
మనుజునకు ఏది ఆనందసముద్రమో అదియే నేను. ఆ ఆనంద సముద్రము మనోబుద్దుల కంటే పరమైనది. ఇందు సంశయము లేదు.
అంతరంగమున ఆనందమును ఆశ్రయించువాడను, ఆశయను పిశాచమును అవమానపరచువాడను, ఈ జగత్తును ఇంద్రజాలము (గారడీ) వలే గాంచువాడను, అసంగుడను అగు నాకు ఆపదయెట్లు కలుగగలదు?
దేహము దేవాలయమని చెప్పబడినది. జీవుడు కేవలము శివుడే అయియున్నాడు. అజ్ఞానము నిర్మాల్యమును తొలగించి సోహం భావనచే (ఆ పరమాత్మనే నేను అను భావనచే) పూజించవలెను.
అభేధదర్శనమే జ్ఞానము. మనస్సును నిర్విషయముగ (విషయసంకల్పము లెవ్వియులేక) నున్చుతయే ధ్యానము. మనస్సు నందలి మాలిన్యమును, అపవిత్రతను తొలగించుటయే స్నానము. ఇంద్రియనిగ్రహమే శౌచము.
బ్రహ్మానందమను అమృతమును త్రాగవలెను. దేహ సంరక్షణ కొఱకు బిక్షాటన మాచరింపవలెను. ద్వైతవర్జితమగు ఏకాంతమున వసించవలెను. ఈ ప్రకారముగా బుద్ధిమంతుడు ఆచరించినచో మోక్షమును బడయగలడు.
ఈ దేహము పుట్టునదియు, చచ్చునదియు అయియున్నది. ఇది మాతాపితృ మలస్వరూపమైనది. సుఖదుఃఖములకు నిలయమైనది. అపవిత్రమైనది.
చర్మము, మాంసము, ఎముకలు మొదలైన ఏడూ విధములైన ధాతువులతో కూడినదియు, మహారోగగ్రస్తమైనదియు, పాపనిలయమైనదియు, అస్తిరమైనదియు, వికారములతో కూడిన ఆకారము కలదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
సదా స్వభావముగానే తొమ్మిది రంధ్రములనుండి మలమును స్రవించునదియు, దుర్గంధముతోను, దుర్మలములతోను కూడినదియుగను ఈ శరీరమును తాకినచో స్నానము చేయవలెను.
మాత్రుసూతకముతో సంబందము కలదియు, సూతకముతో పుట్టినదియు, మృతసూతకమును కలుగజేయునదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
నేను నాదియను అజ్ఞానమువలని అశౌచమును తొలగించుకొనుట శుద్ధశౌచమని చెప్పబడినది. కేవలము మట్టితోను, నీటితోను కలుగజేసికోను శౌచము లౌకికశౌచమే యగును.
వాసనాత్రయమును (లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అను మూడింటిని) పోగొట్టుకొనుటయను శౌచము చిత్తమును శుద్ధ మొనర్చును. జ్ఞానమను మ్రుత్తికతోను, వైరాగ్యమను బలముతోను కడుగుటవలన అది శౌచమననడుచున్నది.
అద్వైతభావనయే భక్ష్యము (భోజనము). ద్వైతభావన భక్ష్యము కాదు. గురువు, శాస్తములు చెప్పిన భావము ప్రకారము సాధకుడు భిక్షువునకు భోజనము విధింపబడుచున్నది.
బుద్ధిమంతుడు సన్యాసానంతరము స్వస్థానమున విడచి ,కారాగారమునుండి విడువబడిన చోరునివలె స్వతః దూరముగ నివసింపవలెను.
ఎపుడు మనుజుడు అహంకారమను కుమారుని, ధనమను సోదరుని, మొహమను ఇంటిని ఆశయను భార్యను వదలివేయునో అపుడాతడు నిస్సంశయముగా ముక్తినోందును.
హృదయాకాశమునందు చిదాత్మయను సూర్యుడు సదా ప్రకాశించుచున్నాడు. అతడు అస్తమించుటలేదు, ఉదయించుటలేదు.
గురువాక్యములచే అద్వితీయమగు పరమాత్మా యొకటియే కలదు అను నిశ్చయము కలిగియుండుటయే ఏకాంతమని చెప్పబడినది కాని, మరముగాని, వసాంతరముగాని ఏకాంతములు కావు.
సంశాయరహితులైన వారికే మోక్షము కలుగును. సంశయగ్రస్తులైనవారికి జన్మజన్మాంతరమందను మోక్షము కలుగదు. కాబట్టి గురుశాస్త్రాదులందు విశ్వాసము కలిగియుండవలెను.
కర్మత్యాగము సన్యాసము కాదు. వ్రేషోచ్చారనమును సన్యాసము కాదు. జీవాత్మల యొక్క ఐక్యమే సన్యాసమని చెప్పబడినది.
సమస్తములైన విషయభోగములందు ఎవరికీ వామమాహారము (వాంతిఅన్నము) నందువలె హేయభావము కలుగునో, దేహభీమానరహితుడైన అట్టివానికే సన్యాసము నందు అర్హత కలదు.
సమస్త పదార్థముల యెడల ఎపుడు మనస్సునందు వైరాగ్యము కలుగునో, అపుడు మాత్రమె బుద్ధిమంతుడు సన్యసింప వలయును. లేకున్న పతితుడు కాగలడు.
డబ్బుకొరకుగాని, అన్నవస్త్రములకొరకుగాని, ప్రతిష్టకోరకుగాని సన్యసించినచో ఉభయ భ్రష్టుడు కాగలడు. అట్టి వాడు మోక్షమును పొందుటకు తగడు.
(బ్రహ్మ) తత్త్వచింతనము ఉత్తమమైనది. శాస్త్రచింతనము మధ్యమమైనది. మంత్రచింతనము అధమమైనది. తీర్థయాత్ర అధమాధమమైనది.
మూఢుడు అనుభూతిలేకయే బ్రహ్మమును గూర్చి వాచాచర్చలు సాగించి సంతోషించుచుండును. అట్టివాడు నీటిలో ప్రతిబింబించిన కొమ్మ చివరిపండ్లను భుజించి సంతోషించువానివలెనే ఉండును.
యతి మాధుకరము (భిక్షాటనము) అను తల్లిని, వైరాగ్యమను తండ్రిని, శ్రద్దయను భార్యను జ్ఞానమను కుమారుని వదలి పెట్టనిచో ముక్తుడగును.
ధనవ్రుద్దులు, వయోవ్రుద్దులు, విధ్యావ్రుద్దులు అందరును జ్ఞానవ్రుద్దునకు భ్రుత్యులే యగుదురు. ఇంతియే కాదు. అతని శిష్యులకును భ్రుత్యులే యగుదురు.
కొందరు పండితులైయున్నను నా మాయచేత మోహితమైన చిత్తముకలవారై, అంతట నిండియున్న ఆత్మనగు నన్ను పొందజాలక కేవలము ఉదరమును నింపుకొనుట కొరకై కాకుల వలె అచ్చటచ్చట సంచరించుచున్నారు.  
యతి శిలామయములును, లోహ మయములును, మణిమయములును ,మృత్తికామయములును అను విగ్రహములును కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షముకొరకై బహ్యార్చనమును విడచిపెట్టవలెను.          
సముద్రముసం దుంచబడిన నిండుకుండవలె పరమాత్మా లోపల, వెలుపల పరిపూర్ణమైనది. మఱియు ఆకాశమునం దుంచబడిన శూన్యఘటమువలె లోపల, వెలుపల (దృశ్య) శూన్యమైనది.
నీవు గ్రాహ్యపదార్థము కావలదు. గ్రాహకపదార్థమున్ను కావలదు. సమస్తభావనలను విడనాడి ఏది శేషించునో, అట్టి ఆత్మతో తన్మయుడవై యుండుము.
ద్రుష్ట, దర్శనము దృశ్యము అను త్రిపుటిని వాసనలతో గూడ విడనాడి ,సర్వదా ప్రకాశమానమైనట్టి కేవలము ఆత్మనే భజింపుము.
సమస్త సంకల్పములు నిశ్శేషముగా శమించినట్టియు, శిలవంటి స్థితిని పోలినదియు, జాగ్రద్దశ, నిద్రాదశ లేనిదియు నగు ఏ స్థితి కలదో, అదియే శ్రేష్టమైన (ఆత్మ) స్వరూపస్థితి అయియున్నది.
నేను అనేకత్వ భేదము లేనివాడను; అఖండానంద స్వరూపుడను, అహంకారము లేనివాడను ;నేను కాను (లేక దృశ్యపదార్ధమును కాను), నేను దేహాదిరహితుడను అయియున్నాను.
నేను సర్వత్ర పరిపూర్ణమైన స్వరూపము కలవాడను; సచ్చిదానంద స్వరూపుడను; సర్వ తీర్థ స్వరూపుడను, పరమాత్మను, శివ (మంగళ) స్వరూపుడను అయియున్నాను.
నేను అఖందానంద స్వరూపుడను, అఖండాకారరూపుడను, ప్రపంచరహితచిత్తుడను, ప్రపంచరహితుడను అయియున్నాను.
నేను సర్వప్రకాశరూపుడను, చిన్మాత్రజ్యోతిస్వరూపుడను కాలత్రయవర్జితుడను, కామాదిరహితుడను అయియున్నాను.
నేను గస్తవ్యమగు ప్రదేశము లేనివాడను, గమనాది రహితుడను, సదా సమరూపుడను, శాంతుడను, పురుషోత్తముడను అయియున్నాను.

ఈ ప్రకారముగ స్వానుభవ మెవనికి కలిగియుండునో అతడు నేనే అయియున్నాను. ఇట సంశయము లేదు. దీనిని ఒకసారి అయినను ఎవడు వినునో అతడు స్వయముగా బ్రహ్మమే యగుచున్నాడు.

No comments:

Post a Comment